Sunday, 22 October 2017

దళిత మహిళ తొలి ఆత్మకథ - ఆదివారం ఆంద్ర జ్యోతిలో (22-10-2017) చందు తులసి సమీక్ష

దళిత మహిళ తొలి ఆత్మకథ

వర్ణ వ్యవస్థ సృష్టించిన అత్యంత హేయమైన దురాచారం అంటరానితనం కారణంగా తరతరాల పాటు దళితుల జీవితాలు అంధకారంలో మగ్గిపోయాయి.
ఆధునిక విద్య,దళిత ఉద్యమాలు తీసుకొచ్చిన చైతన్యంతో ఆ జాడ్యాన్ని రూపుమాపేందుకు ఇప్పటికీ పోరాటం సాగిస్తున్నారు. ఈ క్రమంలో విస్తృతంగా దళిత సాహిత్యాన్ని తీసుకొస్తున్నారు. బాబా అంబేద్కర్ నడిపిన దళిత ఉద్యమంలో తోలి తరం మహిళా కార్యకర్త బేబీ కాంబ్లీ.

ఆమె తన జీవిత కాలంలో మహారాష్ట్రలోని మహర్ల జీవితాల్లో వచ్చిన మార్పులను ప్రతిబింబిస్తూ రాసిన నవల ఇది. జీవా అమూచ అనే పేరుతొ  మరాఠీ పత్రికలో సీరియల్ గా వచ్చిన ఈ  ఆత్మకథ ...  దళిత మహిళ కోణంలోంచి వివరిస్తుంది. తరతరాలుగా దాస్యం,  వేట్టిచాకిరిలో మగ్గిపోయిన మహార్లు ... పేదరికంలో అంత కన్నా రదృష్టకరమైన అంతరానితనంతో దుర్భరంగా జీవించిన వారు, అంబేద్కర్ అందించిన చైతన్యంతో ఉద్యమాలు చేసి ఆత్మగౌరవాన్ని సాధించడమే సంక్షిప్తంగా ఈ నవల సందేశం.
అటు అగ్ర వర్ణ దురహంకారంతో పాటూ, ఇటు దళిత సమాజంలోనూ మహిళలపై హింస, అణచివేత, పురుషాధిక్య భావజాలం, వివక్ష ... పేరుకుపోయిన తీరును కాంబ్లీ అత్యంత సహజంగా చిత్రించారు. అ రకంగా దీన్ని దళిత మహిళ దృక్కోణం లోంచి వచ్చిన మొదటి ఆత్మకథగా చెప్పుకోవచ్చు. ఒక సాధారణ దళిత మహిళ జీవితం ఆత్మకథగా రావడం ఎంత కష్టమో ఈ పుస్తకం చదివితే అర్ధమవుతుంది. మరాఠా పత్రికలో వచ్చిన ఈ రచన తెలుగు లోకి రావడానికి నలభై ఏళ్ళు పట్టడం గమనార్హం .

- చందు తులసి
ఆదివారం ఆంధ్రజ్యోతి



Monday, 2 October 2017

ఈ పుస్తకం చదువుతుంటే మనకు తెలియని మన చరిత్ర పేరిట తెలంగాణా సాయుధ పోరాటం లో పాల్గొన్న మహిళల అనుభవాలను గ్రంధస్థం చేసిన వైన గుర్తుకు వస్తుంది - కే.పీ అశోక్ కుమార్, నవ తెలంగాణా

ఈ పుస్తకం చదువుతుంటే
'మనకు తెలియని మన చరిత్ర' పేరిట తెలంగాణా సాయుధ పోరాటం లో పాల్గొన్న మహిళల అనుభవాలను
గ్రంధస్థం చేసిన వైన గుర్తుకు వస్తుంది
- కే.పీ అశోక్ కుమార్, నవ తెలంగాణా 02-10-2017


Sunday, 24 September 2017

"ఈ యుద్ధం తో ఇక యుద్ధం అనేదాన్ని చంపేస్తాం !"

రెండవ ప్రపంచ యుద్ధంలో సోవియెట్ రష్యాలో
మొత్తం 8 లక్షలకి పైగా అమ్మాయిలు యుద్ధ రంగంలో పనిచేసారు

'యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం' పుస్తకం పై
సాక్షి సాహిత్య పేజీలో సమీక్ష (25-9-2017)



Saturday, 26 August 2017

వంద వసంతాల బోల్షివిక్‌ విప్లవం సందర్భంగా 'యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం' - అనువాదం : నిడమర్తి ఉమా రాజేశ్వరరావు


యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం
మూలం : వార్స్‌ అన్‌వుమెన్లీ ఫేస్‌ , ఎస్‌. అలెక్సీయెవిచ్‌
అనువాదం : నిడమర్తి ఉమా రాజేశ్వరరావు

బైలోరష్యాకి చెందిన అలెక్సీయెవిచ్‌ స్వెత్లానా 1948లో జన్మించింది. 1967లో బైలోరష్యన్‌ ప్రభుత్వ విశ్వవిద్యాలయం లో చేరింది. 1972లో జర్నలిస్టు విభాగంనుంచి పట్టభద్రు రాలైంది. బైలోరష్యా రిపబ్లిక్‌ జిల్లా, తాలూకా పత్రికల్లో పనిచేసింది.

ఈమె సోవియట్‌ యూనియన్‌ రచయితల సంఘ సభ్యురాలు. ఈమె రచించిన ''యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం,'' ''ఆఖరి సాక్షి'' (యుద్ధం గురించి పిల్లల కథనాలు) అనే పుస్తకాలు విశేష ప్రాచుర్యం పొందాయి. ''యుద్ధం స్త్రీ ప్రకృతికి
విరుద్ధం''ను అనేక భాషల్లోకి అనువదించారు, డాక్యుమెంటరీ సినిమాలు తీశారు, నాటకాలుగా మలిచారు.

''యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం'' యుద్ధంలో పాల్గొన్న స్త్రీల కథనాలు.
అవి కథలూ, గాథలూ కావు, బాధాకరమైన భావోద్వేగాలు.

1941లో వధువులు కావాలని బంగరు కలలు గన్న బాలికలు ఎలా సైనికులయ్యారో యిందులోని కథనాలు చెప్తాయి. 20వ శతాబ్దిలో సంభవించిన అత్యంత దారుణమైన రెండవ ప్రపంచ యుద్ధంలో 8 లక్షల మందికి పైగా సోవియట్‌ మహిళలు పురుషులతో సరిదీటుగా పాల్గొన్నారు.

స్త్రీలు క్షతగాత్రులను రక్షించి, కట్లుకట్టడమే కాకుండా, కాల్పులు జరిపారు, వంతెనలు పేల్చారు, శత్రువుల ఆనుపానులు తెలుసుకొనేందుకు వేగు చర్యలు సాగించారు, తమ మాతృదేశం మీద, తమ ఇళ్లమీద, తమ బిడ్డలమీద కనీవినీ ఎరుగని క్రౌర్యంతో దాడిచేసిన శత్రువులను చంపారు.

రచయిత్రి యీ పుస్తక రచనకోసం నాలుగేళ్లు అవిరామంగా శ్రమించింది. నూటికి పైగా నగరాలు, పట్టణాలు, పల్ల్లెలు, జనావాసాలు పర్యటించి, యుద్ధంలో పాల్గొన్నవాళ్ల కథనాలు సేకరించింది. అయితే వాటిలో ముఖ్యమైనవి యుద్ధ రంగంలో జరిగిన ఘటనలు కావు, యుద్ధంలో స్త్రీల గుండెల్ని పిండివేసిన అనుభవాలు.

ఈ ప్రత్యక్ష సాక్షుల కథనాల ద్వారా గతం నుంచి వర్తమానం నేర్చుకోవలసిన గుణపాఠాల పైకీ, నాటి, నేటి ఫాసిజం పైకీ, యుద్ధాన్ని నివారించవలసిన అవసరం పైకీ పాఠకుల దృష్టి ఆకర్షిప బడింది.

- ప్రగతి ప్రచురణాలయం, సోవియట్‌ యూనియన్‌, 1988


వంద వసంతాల బోల్షివిక్‌ విప్లవం సందర్భంగా
'యుద్ధం స్త్రీ ప్రకృతికి విరుద్ధం' -

మూలం : వార్స్‌ అన్‌వుమెన్లీ ఫేస్‌ , ఎస్‌. అలెక్సీయెవిచ్‌

అనువాదం : నిడమర్తి ఉమా రాజేశ్వరరావు

మొదటి ముద్రణ : ప్రగతి ప్రచురణాలయం, సోవియట్‌ యూనియన్‌, 1988

 మలుపు ప్రచురణ : ఆగస్టు 2017

పేజీలు : 112
వెల : 100/-

ప్రతులకు:  
మలుపు 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌-500044
ఇమెయిల్‌ :  malupuhyd@gmail.com

Tuesday, 22 August 2017

స్వేచ్చ కోసం ఒక అడవి బిడ్డ చేసిన వీరోచిత పోరాట గాధ "రాగో". రచన : సాధన; తొలి ప్రచురణ : సృజన, మలి ప్రచురణ : మలుపు


రాగో (నవల)
రచన : సాధన 

ఆకాశంలో సగం కోసం

భారతదేశంలో సుమారు పదకొండు కోట్ల మంది ఆదివాసులు జీవిస్తున్నారు. భారతదేశంలో వర్గ సమాజం రూపొందుతున్న క్రమం నుండి ఆదివాసులు పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఆధిపత్య శక్తులకు లొంగిపోయిన ఆదివాసులు వాళ్ళ ఆర్థిక హోదాను బట్టి కులహోదాను సంతరించుకున్నాయంటారు కోశాంబి. ఈ పోరాటాల చరిత్ర అట్లా ఉంచితే - ఈ ఘర్షణ లొంగుబాట్లలో ఆదివాసి జీవితంలో మనిషిని అణచిపెట్టే ఖాయిదాలు (సంప్రాదాయాలు) అనేకం వచ్చాయి. ఫలితంగా ఈ ఆదివాసులు సమస్త పీడనలను, దోపిడీని ఎదురించాలంటే తమతో తాము - సమస్త పీడలను కాపాడే రాజ్యంతో పాటు యుద్ధం చేయవల్సిందే. అలాంటి యుద్ధంలో ఆదివాసులను సమీకరించడం కోసం
దండకారణ్యంలో 1980 నుండి విప్లవకారులు కృషి చేస్తున్నారు.

ఈ  క్రమంలో ఎదురైన అనుభవాలను తమకు సాధ్యమైన రీతిలో సాహిత్యీకరించ డానికి అలాంటి పనిలో ఉన్నవాళ్ళు నిరంతరం కృషి చేస్తున్నారు. అలాంటి సాహిత్యకారుల్లో అనేక వ్యాసాలు, సరిహద్దు, రాగో (గోండి భాషలో రామచిలుక) రాసిన సాధన కృషి చెప్పుకోదగినది.

సమస్త కళలు, సాహిత్యం అస్థిత్వంలో ఉన్న అధికార రాజ్యపు భావజాలంతోనే నిండి ఉంటాయి. ప్రజాపోరాటాల నేపథ్యంలోనే ప్రజా సాహిత్యం వస్తుంది. ప్రజా పోరాటాల స్థాయియే ప్రజా సాహిత్యపు తీరుతెన్నులను నిర్ణయిస్తుంది. ప్రజా పోరాటాలను గుర్తించి నడిపించే శక్తులే ఇలాంటి సాహిత్యాన్ని ఆదరిస్తారు. ఈ స్థాయి, సందర్భము అర్థం కాకుంటే సాహిత్యం గురించి విడిగా ఆలోచించి చాలా మంది గాభరపడుతారు.

సాధన రచయితగానే కాకుండా అతను సాహిత్యం ద్వారా అన్వేషించిన ప్రశ్నలు, చెప్పిన అనుభవాలు బహుశా సాహిత్యం చదివే చాలా మందికి కొత్త.

ఆదివాసుల గురించి వచ్చిన సాహిత్యం మిగతా సాహిత్యంతో పోల్చుకుంటే చాలా తక్కువ. అందుక్కారణం వాళ్ళు అనేక సంవత్సరాలుగా సభ్య సమాజానికి దూరంగా ఉండడమే. బీహార్‌ ముండా ఆదివాసుల గురించి మహాశ్వేతాదేవి ఒరిస్సాలోని జాతావుల గురించి గోపీనాథ్‌ మహంతి లాంటి వాళ్ళు నవలలు రాశారు. ఈ సాహిత్యం వ్యక్తులుగా ఆదివాసి జీవితాన్ని దర్శించిన తీరు తెలుపుతుంది.

కాని 1980 తరువాత అడవి ప్రాంతాల్లోకి విస్తరించిన ప్రజాపోరాటాలు ఆదివాసి జీవితంలోని సమస్య వైరుధ్యాలను అధ్యయనం చేయవల్సి వచ్చింది. ఈ అధ్యయనపు నేపథ్యంలోనే - సాహు - అల్లం రాజయ్య గోండుల జీవితం మీద కొమురం భీం నవల వచ్చింది. ఈ నవల ఆదివాసి ప్రాంతంలోని రాజ్యాన్ని, దోపిడిని చర్చించింది. ఈ దోపిడి రాజ్యంతో ఆదివాసులు సాగించిన పోరాటంలోని వైఫల్యాలను విశ్లేషించింది. అంతకన్నా భిన్నంగా నడుపాల్సిన పోరాట ఆవశ్యకతను గుర్తించింది.

ఆదిలాబాదు జిల్లాలో ఆదివాసులను దోపిడి చేయడానికి బయటి శక్తులెట్లా చొరబారి నిలదొక్కుకున్నాయో వసంతరావుదేశ్‌ పాండే నవల అడివి చర్చించింది. సాహు రాసిన అనేక కథలు, పాటలు, వ్యాసాలు జరుగుతున్న ఆదివాసి పోరాటాలను ఎప్పటికప్పుడు చిత్రించాయి.

అడవిలో వెన్నెల కథా సంకలనం ఇలాంటి కథలతో వచ్చింది.పులి ఆనంద్‌ మోహన్‌ నవల వసంతగీతం ఆదివాసి జీవితానికి - మైదాన ప్రాంతంలోని ఆదివాసియేతర జీవితానికి ఉండే సంబంధాన్ని, రాజ్యం తన సమస్త అంగాలతో ఈ రెండు ప్రాంతాలల్లోన్ని జనాన్ని ఏ విధంగా అణచి వేస్తున్నదో? అక్కడ కాలూనుతున్న పోరాటాలు ఎంత చిన్నవైనా దోపిడి యంత్రాంగం ఏ విధంగా కదిలిపోగలదో ఇరుపక్షాల చరిత్రను చిత్రీకరించింది.

సాధన నవల సరిహద్దు 1985 తర్వాత కాలానికి సంబంధించినది. 1985 తరువాత విప్లవ ఆచరణలో వచ్చిన అధ్యయనం ఈ నవలలో కనిపిస్తుంది. ఈ నవలలో సాధన ఆదివాసియేతర - ఆదివాసి అనుభవాల సారాంశం ఈ నవల నిండా కన్పిస్తుంది. విప్లవ సాంప్రదాయిక సాహిత్యంలో ఉండే కాల్పనికత - బోధనల నుండి జఠిలమైన యాతన, పీడనల సమాజంలోని అనేక అంశాలను ఇంకా లోతుగా అధ్యయనం చేయాలని ఈ నవల ప్రతిపాదిస్తుంది. రూపం, భాష తదితర విషయాలల్లో సరిహద్దు నవల సాధన మొదటి నవల.సాధన రెండో నవల రాగో. ఒక రకంగా సరిహద్దు నవల కొనసాగింపులాగా కనిపిస్తుంది ఈ నవల. పాత్రలు కూడా చాలా వరకు రెండు నవలల్లో ఒకే పాత్రలు. కాని ఈ నవల వస్తువులో రూపంలో పూర్తిగా భిన్నమైనది.

రాగో యుక్త వయస్కురాలైన మాడియా గోండు యువతి. గోండుల్లో ఉన్న ఆచారం ప్రకారంగా రాగో చిన్నపిల్లగా ఉన్నప్పుడే రాగో తండ్రి పిల్ల నిస్తానని ఒక బీద యువకున్ని లామడే (ఇల్లరికం) తెచ్చుకున్నాడు. రాగో శారీరకం గానే కాక, మానసికంగా కూడా ఆ యువకున్ని ఇష్టపడలేదు. అదే గ్రామంలోని మరొక పెళ్ళయిన యువకునితో రాగోకు సంబంధం కలిసింది (బహు భార్యాత్వం ఉంది). పెళ్ళి కాదంటే రాగో తండ్రి లామడే యువకునికి అన్ని సంవత్సరాలకు జీతం కట్టాలి - బలవంతపు పెళ్ళి నుండి తప్పించుకొని కోరుకున్న వాని ఇల్లుసొచ్చింది అతను ఉంచుకుంటే ఆ యువకుడికి జీతం ఇచ్చుకోవాలి. కోరుకున్నవాడు భయపడ్డాడు. రాగోను పశువును బాదినట్లు బాదుతూ మళ్ళీ తీసుకవచ్చారు. రాగో ఈ దుర్మార్గమైన ఖాయిదాను ఖాతరు చెయ్యదలచుకోలేదు. తప్పించుకున్నది. అడవిలో చెట్లు పుట్టలు పట్టి తిరిగింది. చివరకు స్నేహితురాలు ఇల్లు చేరుకున్నది. మళ్ళీ తండ్రికి దొరికింది. మళ్ళీ తన్నులు గుద్దులు. మళ్ళీ రాగో తప్పించుకున్నది.

ఈసారి మాడియా మనుషులేకాదు మనుషులంతా దుర్మార్గులేనని వ్యక్తులుగా మంచివాళ్ళుగానే ఉన్నా? తనలాగే పెనుగులాడినా చివరకు ఖాయిదా వాతబడి మనుషులపట్ల ముఖ్యంగా స్త్రీలపట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తారని ఆలోచించింది. అడివిలో తిరుగుతూ తనకు పరిచయమున్న సమస్త మానవ సంబంధాల గురించి ఆలోచించింది. ఆ విధంగా దారితెన్ను కానకుండా తిరుగుతున్న దశలో దళంతో కలిసి - అక్కడి నుండి రాగో దళ జీవితంలో ఊపిరి సలుపకుండా తిరుగుతుంది. తనొక్కతే అనుభవించిన క్షోభ - స్వేచ్ఛ కోసం పడిన ఆరాటం మాడియా స్త్రీలందరిలోనూ చూస్తుంది. ఈ బాధలు ఖాయిదాల స్వరూప స్వభావాలు - అవి మొత్తం ఆదివాసి జీవితంలో పెనవేసుకపోయిన తీరు అర్థం చేసుకుంటుంది. పార్టీ సభ్యత్వము, తండ్రి రాగోను ఆమోదించడంతో నవల ముగుస్తుంది.

ఈ నవల రాగో లేవనెత్తిన ప్రశ్నల రూపంలో ఆదివాసి ఖాయిదాలకు సంబంధించినట్టు కన్పించినా ఇవి ప్రపంచ ప్రజలవి. ముఖ్యంగా ప్రపంచ జనాభాలో సగ భాగంగా ఉన్న స్త్రీలకు సంబంధించినవి.

సకల మానవ సృష్టిని, వ్యక్తీకరణను నియంత్రించే క్రమంలోనే రాజ్యం తనను తాను నిలబెట్టుకున్నది. రాజ్యం తన మనుగడ కోసం వ్యక్తుల వ్యక్తిత్వాన్ని, వ్యక్తీకరణను నియంత్రించే నిర్మాణ రూపాలను రూపొందించుకున్నది. అలాంటి నిర్మాణ రూపంలో చాలా పురాతనమైనది, సంక్లిష్టమైనది, జటిలమైనది ఇంతవరకు జరిగిన వర్గపోరాటాల్లో కూడా మిగిలి ఉన్నది కుటుంబం. అయితే రాజ్యంతో మానవులు జరిపిన పోరాటాల చరిత్ర తెలిసినంతగా మానవులు కుటుంబంతో జరిపిన పోరాటాల చరిత్ర (ఒక్క టాల్‌స్టాయ్‌ అన్నా కెరీనా తప్ప) ముఖ్యంగా భారతీయులకు కొత్త. ఉత్పత్తి, పునరుత్పత్తి, లింగ భేదాలతో పాటు అనేక పీటముళ్ళతో ఈ చరిత్ర నిండి ఉన్నది. అయినా అనివార్యంగా ఈ కుటుంబంతో, కుటుంబంలో మానవులు ఎడతెగని ఒంటరి పోరాటాలు చేస్తున్నారు. మనం ఇప్పటి దాకా చూసిన అన్ని రకాల సమాజాలల్లో ఈ పోరాటం కొనసాగుతూనే ఉన్నది. కుటుంబం పురుషుల కన్నా స్త్రీలను దాదాపు సంపూర్ణంగా అణచివేసింది.

కుటుంబంలో జరిగిన భయంకర యుద్ధంలో స్త్రీలదే ప్రధాన పాత్ర.రాగో ప్రశ్నలన్నీ ఇట్లాగా నిర్మితమై కొనసాగుతున్న కుటుంబానికి సంబంధించినవి. రాగో రామచిలుకలాగా స్వేచ్ఛగా ఆకాశంలో ఎగురాలనుకున్నది. మనిషిని మనిషి చేరుకోవడానికి ఉన్న సమస్త అడ్డంకులను ప్రశ్నించింది.

అయితే ఇలాంటి స్వేచ్ఛకు వ్యక్తీకరణకు సంబంధించిన రాగో దళంలో చేరడంతో అన్ని ప్రశ్నలకు జవాబు దొరికిందా? మహా అయితే ప్రశ్నలు మరింత జటిలమయ్యాయి. దళంలో తిరిగి విప్లవ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా మనుషుల   సమస్త బంధనాలు త్రెంచేయగలమని రాగో తనకు తాను జవాబు చెప్పుకున్నదా? దళంలో ఉండే ఇతర సభ్యులందరికి ఇలాంటి ప్రశ్నలున్నాయి. తీరిక లేని దళ కార్యక్రమంలో తిర్గడానికి - ప్రజాపోరాటాలు నిర్ణయించడానికి మధ్య చర్చించని అగాధం - చాలా ముఖ్యమైనవి.

ఒక్క మాటలో చెప్పాలంటే సమస్త ఉద్రిక్తతలతో యాతనలతో విసిగి వేసారి జనం తమ సంపూర్ణ వ్యక్తీకరణ కోసం, స్వేచ్ఛ కోసం పోరాడడానికి సిద్ధపడతారు. ఇలాంటి స్వేచ్ఛను ఆర్తితో పట్టించుకొని నూతన ప్రజాస్వామిక విప్లవాచరణలో ఓపికగా నడిపించగల్గినప్పుడే సమస్త పీడనలు పోవడానికి మార్గం సుగమమౌతుంది.అడవిలో ఒంటరిగా తిరుగుతూ రాగో వేసిన ప్రశ్నలు నిజానికి దళం ముందు చెప్పనేలేదు. బహుశా ఆ వొత్తిడిని తట్టుకోలేక దారీతెన్నూ కానక దొరికిన దారిలో నడిచిందేగాని అదే అసలైన దారి అని పూర్తిగా నమ్మలేదు. అట్లని అంతకన్నా రాగోను మనిషిగా ఇదివరకు పరిగణించిన వారూలేరు.

రాగోలాగే మనుషులంతా ఎగురాలనే తీవ్రమైన అన్వేషణలో ఉన్నారు. వెతుకులాటలో ఉన్నారు...
తన్ను తాను తెలుసుకోవడమే కాదు. తనలాంటి వాళ్ళను తనతో పాటు రాగో తీసుకపోగలదా?
ప్రపంచం అతలాకుతలంగా ఉన్న ఈ సంక్షుభిత సమయంలో భవిష్యత్తు రాగో మీద ఆధారపడి ఉన్నది.

- యస్‌. పి. వసంత
(ముందుమాట )

రాగో (నవల)
రచన : సాధన


మొదటి ముద్రణ : నవంబర్‌, 1993, సృజన ప్రచురణలు
మలుపు ప్రచురణ పునర్ముద్రణ ఆగస్టు 2017

పేజీలు : 144
వెల : 120/-


ప్రతులకు: 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌-500044
ఇమెయిల్‌ :  malupuhyd@gmail.com

Thursday, 27 July 2017

తలకిందుల లోకం మూలం : కాఫ్కాలాండ్‌ - మనీషా సేఠి, తెలుగు అనువాదం : ఆర్‌. శశికళ

తెలుగు ప్రచురణకు ముందుమాట
అత్యవసరమైన చర్చ 
- జస్టిస్‌ బి. సుదర్శన్‌ రెడ్డి 

తీవ్రంగా కలత పెడుతున్నప్పటికీ, చదవమనీ, లోపల ఇంకించుకొమ్మనీ, ఏదో ఒక చర్యకు పూనుకొమ్మనీ ఒత్తిడి పెట్టే పుస్తకాలు అంత తరచుగా ఏమీ రావు. మనీషా సేఠీ రాసిన, ప్రస్తుతం మీ చేతిలో ఉన్న ఈ పుస్తకం, 'కాఫ్కాలాండ్‌ - ప్రిజుడిస్‌, లా అండ్‌ కౌంటర్‌ టెర్రరిజం ఇన్‌ ఇండియా' తప్పనిసరిగా ఆందోళన పరిచేది. కాని అదే సమయంలో ఈ పుస్తకం ఆశను కూడ రేకెత్తిస్తుంది. అది లేవనెత్తుతున్న సమస్యలను ఎంత తక్షణం పరిష్కరించవలసి ఉన్నదో తెలియజెపుతుంది. దేశం బలమైన ఫాసిస్టు పాలనా పద్ధతివైపు నిరాటంకంగా ప్రయాణిస్తున్నదని ప్రగతిశీల శక్తులలో పొడసూపుతున్న అనుమానపు ఛాయలు, వాస్తవికమైనవేనని నేననుకునేవి, ఉన్నప్పటికీ ఇటువంటి పుస్తకం ప్రచురణ కావడమే, ప్రజలందరికీ విరివిగా అందుబాటులోకి రావడమే, రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కుల రక్షణకు స్థలం ఇంకా మిగిలి ఉన్నదనీ, సకారణమైన, హేతుబద్ధమైన చర్చకు అవకాశం ఉందనీ, ఆశను రేకెత్తిస్తున్నాయి. ధైర్యంగా ఇటువంటి పుస్తకం రాయడానికి, బహిరంగంగా తన పేరుతో ప్రచురించడానికి సిద్ధంగా ఒక రచయిత ఉన్నారనే వాస్తవమే ఆ ఆశను బలోపేతం చేస్తుంది. సాధారణంగా మూకదాడులతో కలిసి, లేదా రాజ్య యంత్రాంగంతో కలిసి, అసహనం ప్రదర్శించడమే, వాదనలను పరిష్కరించుకోవడానికి ఏకైక వ్యక్తీకరణ సాధనంగా ఉన్న సమయంలో, రాజ్యాంగ విలువల పట్ల లోతైన, విధేయమైన విశ్వాసాన్ని ప్రకటించేవారి గళాలను నొక్కివేయడం, కుత్తుకలను కత్తిరించడం ఏకైక వ్యక్తీకరణ సాధనంగా ఉన్న యుగంలో సానుకూల మానవ పర్యవసానాలను పరిరక్షించే ఈ కృషి వీరోచితమైనదనిపిస్తుంది.

తీవ్రవాదానికి వ్యతిరేకంగా అనే పేరుతో భద్రత అనేదాన్ని ఎలా సంభావిస్తున్నారో, ఎలా నిర్వహిస్తున్నారో కాఫ్కాలాండ్‌ ఎన్నో భిన్నమైన వాస్తవాలతో, ఉదంతాలతో, ఘటనలతో, ఆరోపణలతో చూపుతుంది. వాటన్నిటి నిజానిజాలను వ్యక్తిగతంగా పరిశీలించే అవకాశం నాకు లేదనేది స్పష్టమే. అది ఒక అసాధ్యమైన పని అవుతుంది. కాని, నాలుగు దశాబ్దాలకు పైగా న్యాయవాదిగా, న్యాయమూర్తిగా పనిచేసిన అనుభవంతో, జాతీయ భద్రత పేరుతో హక్కుల ఉల్లంఘనలు జరిగిన ఇటువంటి ఘటనలతో వ్యవహరించిన వ్యక్తిగా, మనీషా సేఠీ ఈ పుస్తకంలో వర్ణించిన ఘటనలు జరిగి ఉండవని అనలేను. దానితో నా విచారం మరింతగా పెరుగుతుంది. ఎందుకంటే మన రాజ్యాంగ పథకం అమలులో వ్యవస్థ వైఫల్యం గురించిన ప్రశ్నలను అది లేవనెత్తుతుంది. ఈ పుస్తకం వివరిస్తున్న సమస్య పరిమాణమూ వైశాల్యమూ చూస్తే ఈ సమస్యను తక్షణమే పరిష్కరించవలసి ఉందని అర్థమవుతుంది. ఆ పరిష్కారం కేవలం ఏకాంత దంత ప్రాకారాలలో అమూర్త చర్చల స్థాయిలో మాత్రమే కాదు. మన వ్యవస్థలలో ప్రతి నిర్మాణం పట్ల శ్రద్ధ ఉన్న పౌరులందరూ, మన సామాజిక-రాజకీయ చర్చా సందర్భాలన్నిటిలోనూ ఆ చర్చ జరపవలసి ఉంది.

ఈ పుస్తకం ఇతివృత్తపరంగా మూడు భాగాలుగా రూపొందింది. బహుశా త్రీ ఎస్సేస్‌ కలెక్టివ్‌ అనే ప్రచురణకర్తల కోరిక మేరకు ఈ నిర్మాణం రూపొంది ఉండవచ్చు. కాఫ్కాలాండ్‌ అనే శీర్షికతో ఉన్న మొదటి భాగం తీవ్రవాదానికి వ్యతిరేకంగా జరుగుతున్న యుద్ధంలో రాజ్యాధికారాన్ని దుర్వినియోగం చేసిన కొన్ని నిర్దిష్ట ఉదంతాలను వివరించింది. నేరానికి శాస్త్రీయ సాక్ష్యాలుగా చూపే నార్కో అనాలిసిస్‌ పరీక్షలో రాబట్టిన జవాబులను కూడ మార్చిన డా. నార్కో చేతివాటం నుంచి, మాలేగావ్‌ పేలుళ్ల కేసులో ఎటిఎస్‌ అభియోగపత్రాన్ని తారుమారు చేసి, ఎన్‌ ఐ ఎ సాధించిందని చెపుతున్న సాక్ష్యాధారాల పర్యవసానాల దాకా, రచయిత జాగ్రత్తగా, సమగ్రంగా వాస్తవాలను పేర్కొన్నారు. ఇష్టారాజ్యపు అరెస్టులు, సాక్ష్యాధారాల తయారీ, కొన్ని సమూహాలను మొత్తంగా ఉద్దేశపూర్వకంగా లక్ష్యంగా చేసుకోవడం వంటి రూపాల్లో వ్యక్తమవుతున్న వ్యవస్థాగత దురభిప్రాయాల గురించి ఆమోదయోగ్యమైన వాదనలు చేశారు. వెంటాడుతారేమో అనే భయం గురించి, అమాయకుల భీతి గురించి, ''వ్యవస్థలకు బాధ్యులైన అధికారులే ప్రమాణాలను తారుమారు చేసే'' సౌలభ్యం గురించీ, ''భయభీతావహపు, అహంకారపూరిత దురుద్దేశాల ప్రాముఖ్యత'' గురించి ఆమె చేసిన చర్చలు అంతే బలంగా సాగాయి. ఒక న్యాయవాదిగానూ, ఒక న్యాయమూర్తిగానూ, నేను న్యాయం సక్రమంగా అమలు కాకపోతే జరిగే పర్యవసానాల గురించి పరిశుద్ధమైన న్యాయశాస్త్ర రూఢివాదంతో జరిగిన చర్చలు చాల తరచుగా విన్నాను. ఒక అమాయకుడికి శిక్ష విధించడానికి నిర్ణయించుకున్న రాజ్యాంగ యంత్రపు పాశవికత, ఒక అమాయకుడి నిస్సహాయ స్థితి ఈ పుస్తకంలో చాల అరుదైన దృష్టితో పట్టుకున్నారని చెప్పక తప్పదు.

రెండో భాగంలో సేఠీ ''రాజకీయ పాలకులకూ అధికారులకూ మధ్య కుదిరిన ఒడంబడిక''ను తేటతెల్లం చేశారు. ఆ అధికారులు చట్టాన్ని అమలు చేసే బాధ్యత ఉన్న విభిన్న సంస్థలకు చెందినవారు. ఆ ఒడంబడిక చట్టాన్ని చాల సులభంగా తలకిందులు చేసి, ఒక ఆచరణాత్మక జాతీయ, అంతర్జాతీయ భద్రతా వ్యవస్థను నిర్మించి, అమాయకులను బాధితులుగా మార్చడమే పనిగా పెట్టుకున్నది. దేశంలో అవసరమైన ఏకైక మానసికస్థితి యుద్ధంలో సైనికుడి మానసిక స్థితి మాత్రమేననే ఒక ఆలోచనాస్రవంతిని ప్రచార మాధ్యమాలలో సృష్టిస్తారు. దాని సాయంతో ''ప్రజా మేధావులు'', వ్యాఖ్యాతలు దేశం మొత్తానికీ ఒక తక్షణ ప్రమాదం పొంచి ఉన్నదని వాదిస్తారు. ఇక్కడ సేఠీ ఏమని ఆరోపిస్తారంటే, ''శక్తిమంతులు దేశాన్ని ఒక అనైతిక ఆచరణాత్మకత ప్రకారం నడుపుతుంటారు. అధికారం లేనివారు పిరికితనంతో భయపడుతూ జీవించాలి. వారికేమీ తేడా పడదు''. న్యాయస్థానాలలో జరిగిన వ్యాజ్యాల రూపంలోనూ, సంస్థలలో, బహిరంగా స్థలాలలో జరిగిన చర్చ రూపంలోనూ ఆధారాలెన్నో చూపించి సేఠీ ఒక బలమైన వాదన ముందుకు తెస్తారు. తీవ్రవాదమూ, అంతర్గత అసమ్మతీ తెస్తున్న సమస్యలను తాము ''మానవహక్కుల చర్చ'' వల్ల పరిష్కరించలేకపోతున్నామని చట్టాన్ని అమలు చేసే సంస్థలు రాజకీయ వ్యవస్థను లొంగదీశాయి. రాజఈయ వ్యవస్థ రాజ్యాంగ పథకాన్ని, రాజ్యాన్ని, దాని అంగాలను నియంత్రించే ఏర్పాట్లను త్యాగం చేసింది.

సేఠీ చేసిన ఈ నిర్ధారణ తీవ్రంగా ఆందోళన కలిగిస్తుంది. అది ప్రత్యేకంగా నాకెందుకు ఆందోళన కలిగిస్తుందంటే నేను ఈ రాజ్యపు మూలస్తంభాల్లో ఒకదానిలో పనిచేశాను. దేశంలో రాజ్యాంగ పథకాన్ని నిర్వచించడంలో, వ్యాఖ్యానించడంలో ముందువరుసలో ఉన్నాను. రాజ్యానికీ, రాజ్య సంస్థలకూ, రాజ్య అధికారులకూ మధ్య తమ సొంత ప్రజలకు వ్యతిరేకంగా పని చేయాలనే ఒక ఒడంబడిక ఉన్నదని రచయిత ఉద్దేశిస్తున్నారనిపిస్తుంది. దేశంలో ఆంతరంగికంగా ముందస్తు భద్రతనూ, ప్రతిక్రియగా భద్రతనూ కల్పించవలసిన బాధ్యత ఉన్న సంస్థల అధికారులకూ రాజ్యానికీ మధ్య ఇటువంటి ఒడంబడిక ఉన్నదనడం మరింత విధ్వంసకరమైనది. ఈ ఒడంబడిక జాతీయ భద్రతా అధికారుల శిక్షాతీత, విచారణాతీత నేరప్రవృత్తిగా వ్యక్తీకరణ పొందుతుంది. అప్పుడిక ఏదో ఒక ప్రత్యేక సందర్భంలో రాజ్య శక్తుల అత్యాచారానికి వ్యతిరేకంగా ఆందోళన వ్యక్తమైనప్పుడు దాన్ని చల్లార్చడానికి చట్టాన్ని కపటత్వంతో ఒక సిగ్గుబిళ్లలా, సర్వరోగనివారిణిలా వాడుతుంటారని సేఠీ వాదిస్తారు. అది కూడ చివరికి విస్మరణకు గురవుతుందని, చట్టాన్ని ఉల్లంఘించిన అధికారులకు శిక్ష విధించాలని రాజకీయ వ్యవస్థ పట్టుపట్టదని ఆ అధికారులకు కూడ తెలుసునని ఆమె వాదిస్తారు.

సేఠీ రచనను ఎట్లా వ్యాఖ్యానించాలనే విషయంలో నేను రెండు ఆలోచనలు పంచుకోదలచాను. రాజ్యాంగబద్ధంగా హామీ ఇచ్చిన హక్కులను కత్తిరించడానికి రాజ్యాధికారం తరచుగా ప్రయత్నిస్తున్నదనడం ఎంతమాత్రం కాదనడానికి లేదు. అలా జరగడం మనం అసంఖ్యాక సందర్భాలలో పదే పదే చూశాం. వ్యాజ్యాల న్యాయశాస్త్రం, అటు ప్రభుత్వ సంస్థలూ ఇటూ పౌరసమాజమూ సమర్పించిన లెక్కలేనన్ని నివేదికలు ఆ విషయానికి సాక్ష్యం చెపుతాయి. అయితే మనం అడగవలసిన ప్రశ్న, రాజ్యపు చరిత్రంతా అటువంటి వైఫల్య సందర్భాల చరిత్రేనా అని. రాజ్యాంగ ప్రణాళికను కొనసాగించే శక్తి ఎప్పుడూ లేనేలేదని, భవిష్యత్తులో కూడ దాన్ని సాకారం చేసుకోలేమని నిర్ధారించేదాకా పోగలమా అని.

అలా అనుకోవడం మన రాజ్యాంగ చరిత్రను అపసవ్యంగా అర్థం చేసుకోవడమేనని నాకు అనిపిస్తుంది. భారతదేశం పాలించడం కష్టమయ్యేంత అనంత సంక్లిష్టత కలిగిన దేశం. రాజ్యాంగ ప్రణాళికను అర్థం చేసుకోవడానికి, క్రియాశీలంగా పరిరక్షించడానికి అవసరమైన సామర్థ్యాలు నిరాకరించబడిన జనబాహుళ్యపు దేశం ఇది. అందువల్ల మన చరిత్రను మరింత జాగ్రత్తగా, సునిశితంగా మదింపు వేయవలసి ఉంటుంది. ప్రజాస్వామిక ప్రక్రియ ప్రజానీకంలో వేళ్లూనుకుని, బలపడినకొద్దీ రాజ్యమూ, రాజకీయ శిష్టవర్గాలూ ప్రతిస్పందించక తప్పదు, విధాన నిర్ణయాల పరిధిని విస్తరించక తప్పదు అని కూడ మనం గుర్తించాలి. ఇదేమైనా యథాలాపమైన విజయమా? కాదనే అనుకుంటాను. గతంలో కూడ నిరంకుశ ప్రభుత్వాలను న్యాయస్థానాలు సవాలు చేశాయి, ఎదిరించి నిలిచాయి, వ్యవస్థాగతమైన వివక్షను రద్దు చేసే సంస్కరణలలో కొన్నిటినైనా రాజకీయ వర్గాల చేత అమలు చేయించడంలో విజయం సాధించాయి. పాతుకుపోయాయని చాలమంది మేధావులు భావించిన పాలనలను కూడ సాధారణ ప్రజలు ఎన్నికల్లో దించివేసి సాహసోపేతమైన పాత్ర నిర్వహించారు. ఈ వాస్తవాలన్నీ ప్రగతిశీల చర్యల స్థూలమైన ఉదాహరణలు. ఇవి రాజ్యాంగ విలువలను సాధించే అవకాశాల ఆశాసూచికలు.

సేఠీ ప్రస్తావించిన ఎందరో బాధితులకు, అసలు ఎక్కడా గుర్తింపుకు రాకుండా ఉన్న మరెందరో లెక్కలేనంతమందికి ఇక్కడ నేను చెపుతున్నది రుచించకపోవచ్చుననేది, సరిపోదనేది స్పష్టమే. న్యాయాన్ని ఒక క్రమపరిణామపు, సామూహిక సందర్భంలో మాత్రమే గణనలోకి తీసుకోలేమని, తప్పనిసరిగా దాన్ని ఇక్కడ లక్ష్యంగా ఉన్న ప్రతి ఒక్క మానవజీవి స్థాయిలో, సమూహాల స్థాయిలో వ్యక్తీకరించవలసి ఉంటుందనీ అనేట్టయితే సేఠీ అభియోగాల పట్ల నేను మౌనం వహించకతప్పదు.

ఔను, నేను ఆశ గురించీ, తోసుకొచ్చే తొందరపాటు గురించీ కూడ రాశాను. మనను మనం నాగరిక మానవ జీవులుగా ప్రకటించుకునేవాళ్లం ఎవరమైనా పాటించవలసిన ఒక నైతిక కర్తవ్యాన్ని కూడ నేనిక్కడ కలపదలచాను. రాజ్యాంగ ప్రణాళికకు సంబంధించిన నైతిక మూలాన్ని మనం మన శరీరంలోని, ఆత్మలోని ప్రతి కణంతోనూ మన ఆలోచనల, ఆచరణల కేంద్రస్థానంలోకి తీసుకురావాలి. సేఠీ గుర్తించిన వ్యక్తుల వేదన, వారు అనుభవించిన భయోత్పాతం ఆ నైతిక కర్తవ్యాన్ని నిర్దేశిస్తున్నాయి. మన ఆచరణను నిర్దేశించడం కోసం వారు వేదనను అనుభవించారనే గ్రహచార ఆవశ్యకతను నేను నమ్మను. కాని వారి కడగండ్ల కథలన్నీ మనలో ఏమాత్రమైనా ఉన్న ప్రశాంతతను, సంతృప్తిని చెదరగొట్టవలసి ఉంది. నేను దీన్ని నైతిక కర్తవ్యంగా ఎందుకు చేరుస్తున్నానంటే, తోసుకొచ్చే తొందరపాటు అని ఎందుకు నొక్కి చెపుతున్నానంటే, భారతదేశంలో పూర్తిస్థాయి ఫాసిజం ప్రవేశిస్తున్న ప్రమాదసూచనలు కనిపిస్తున్నాయి గనుక.

ఇక కాఫ్కాలాండ్‌ లోని మూడో భాగం గురించి చెప్పవలసి ఉంది. ఈ భాగంలో సేఠీ ఆశ్రిత పెట్టుబడిదారీ విధానపు ప్రయోజనాలను వర్ణించారు. ప్రజలను భయోత్పాతంలో ముంచి, ఆ భయ సూచనలను అపరిమితంగా పెంచడం ద్వారా, సాధించే ప్రభుత్వ నిధులనుంచి ఆశ్రిత పెట్టుబడిదారులు లాభాలు పొందదలచుకున్నారు. ఈ సందర్భంలో సేఠీ చేసిన పరిశోధన మనను ఒక్కసారి కుదిపి, తక్షణ ప్రమాదాలు, అస్తిత్వ ప్రమాదాలు అనే వాదనలను, అందువల్ల ఎప్పటికప్పుడు ఇంకా ఇంకా ఎక్కువ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం కావాలనే కోర్కెలను విమర్శనాత్మకంగా పరిశీలించమని ఒత్తిడి చేస్తుంది. ఆ సాంకేతిక పరిజ్ఞానమంతా మరింతగా వ్యక్తిగత హక్కులను కత్తిరించే భయానకమైన మూల్యంతో రానున్నది.

భద్రతా అధిభౌతిక వాదన అనేదాన్ని వ్యక్తీకరిస్తున్నప్పుడు, సేఠీ ఆ విశ్లేషణను మరింత ముందుకు, మరింత లోతుకూ తీసుకుపోతారని నేను ఆశించాను. ముఖ్యంగా ఉదారవాదులు నెలకొల్పడానికి ప్రయత్నించిన రాజకీయార్థిక వ్యవస్థలో సామాజిక న్యాయ భావనను అనైతికమనే పేరుతో పక్కనపెట్టడం, పెరుగుతున్న అసమానతల సమస్యలు, తత్ఫలితంగా పుట్టుకొచ్చిన అభద్రతలు వంటి వాటిని విస్మరించడం, కేవలం అసూయా జనితమైన అనైతిక ఆలోచనలుగా ఖండించడం జరిగి, అది ప్రత్యక్షంగా  ''మానవహక్కుల వాళ్ల'' నైతిక అధికారం తగ్గిపోవడానికి దారితీసిందా పరిశీలించవలసి ఉంది. రాజ్యాంగాన్ని ఆమోదిస్తున్నప్పుడు డా. అంబేద్కర్‌ హెచ్చరించినట్టుగా, ఆర్థిక, సామాజిక భద్రతా ప్రణాళికను విస్మరించడమే రాజకీయ హక్కుల విధ్వంసానికి దారితీసిందని నేను భావిస్తాను. బహుశా ఆ మహానుభావుడు ఊహించిన చీకటి భవిష్యత్తులో పరాన్నభుక్కు పెట్టుబడిదారీ విధానపు పెద్దమనుషుల కోటు అంచులకు వేలాడే శక్తిమంతులు అధికారపీఠాలను అధిరోహించడం కూడ ఉన్నదేమో. మన ఆధునికానంతర తొందపాటులో, మనం వ్యక్తికి ఉన్న ప్రతిఘటనా సామర్థ్యాన్ని అది ఎంత వీరోచితమైనదప్పటికీ, అతిశయోక్తులతో ఊహించామేమో. అందువల్ల ఆమోదనీయమైన కనీస ఆర్థిక, సామాజిక న్యాయ స్థాయిలలో ప్రజాస్వామిక బృందాల, కూటములను ఏర్పాటు చేసే సామర్థ్యమూ, ప్రతిఘటనా వాదనలు జరిపే సామర్థ్యమూ ధ్వసంమైపోతుంటే నిర్లక్ష్యం చేశామేమో. రాజకీయ న్యాయాన్ని మాత్రమే విస్తరించడానికీ, సుస్థిరం చేయడానికీ ప్రయత్నించామేమో?

మన రాజ్యాంగం ఒక ఆత్మహత్యా పత్రం కాదు. చట్టం విధించిన పరిమితుల లోపల పౌరులకు భద్రత కల్పించడానికి రాజ్యానికి ఇచ్చిన బాధ్యత మీద ఆంక్షలు విధించేలా దాన్ని వ్యాఖ్యానించలేము. ఆ భద్రతను కల్పించే పనిలో చట్టాన్ని పక్కన పెట్టవచ్చుననే వాదనలు మరొక కొసన ఆత్యహత్యా సదృశమైనవే. అంటే మనం చట్టాన్నే ధ్వంసం చేయవలసి వస్తుంది. విధ్వంసశక్తులతో ఘర్షణలలో ఒక ప్రజాస్వామిక రాజ్యం ఆ చట్టాన్ని రక్షించడానికే అ యుద్ధాలు చేస్తుంది. మన రాజ్యాంగం పౌరులకు వాగ్దానం చేసిన న్యాయాన్ని సాకారం చేసే పరిధిలోనే చేస్తుంది. భద్రతను కల్పించే రాజ్య సామర్థ్యానికి చట్టమూ రాజ్యాంగమూ ఆటంకంగా ఉంటాయనే వాదనను కొనసాగిస్తే అసలు రాజ్యం ఏర్పడిన మూలకారణాన్నే కోల్పోయే జారుడుబల్ల మీద జారిపోతాం.

యుద్ధసమయంలో చట్టాలు మౌనం వహించాలని సిసిరో చేసిన వ్యాఖ్య సుప్రసిద్ధమే. ఎందరో మహానుభావుల భుజాల మీద నిలబడి, మానవ సమాజపు సంచిత వివేకం మీద ఆధారపడి మనం అనగలిగినదేమంటే సిసిరో మాట అక్షరాలా తప్పు అని. రాజ్యాంగబద్ధమైన ప్రజాస్వామిక రాజ్యాల మౌలిక సూత్రం ఏమంటే రాజ్యం, దాని అంగాలు చేసే ప్రతి పనీ చట్టాలకు లోబడి ఉండాలనేదే. ఈ ఏర్పాటులో అతి కీలకమైన ఆవశ్యకత ఏమంటే యుద్ధశతఘ్నులు పేలుతున్నప్పుడు కవుల గొంతులు నొక్కడానికి వీలులేదు అని. ఎందుకంటే అసలు శతఘ్నులు పేలుతున్నాయా లేదా అంచనా కట్టడానికి, ప్రజాస్వామిక అధికార పగ్గాలు అప్పగించబడినవారు చట్టం పరిధి లోపల ప్రవర్తిస్తున్నారా లేదా మదింపు వేయడానికి వాళ్లు అవసరం. అందువల్ల, సేఠీ పుస్తకం ఇవాళ భారతదేశంలో అమలవుతున్న ''భద్రతా అధిభౌతిక వాదన'' స్వభావం గురించి ఒక సకారణమైన, సమంజసమైన చర్చకు దారితీస్తుందని నేను ఆశిస్తున్నాను. సేఠీ నిర్ధారణలతో మనం అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు, కాని ఈ చర్చ అతి ముఖ్యమైనదని మాత్రం మనం అంగీకరించవచ్చు, అంగీకరించక తప్పదు.
(తెలుగు అనువాదం : ఎన్‌. వేణుగోపాల్‌)

మలుపు ప్రచురణ 

తలకిందుల లోకం
మూలం : కాఫ్కాలాండ్‌
మనీషా సేఠి
అనువాదం : ఆర్‌. శశికళ

 వెల : రూ. 150/-

ప్రతులకు : 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌ - 500 044.

Email : malupuhyd@gmail.com

Friday, 7 July 2017

కశ్మీర్‌లో నిషిద్ధ రాత్రి - పునర్ముద్రణ వెలువడింది


మలుపు ప్రచురణ 

కశ్మీర్‌లో నిషిద్ధ రాత్రి

పునర్ముద్రణ వెలువడింది

మూలం : కర్ఫ్యూడ్‌ నైట్‌ - బషరత్‌ పీర్‌
అనువాదం : యార్లగడ్డ నిర్మల

వెల రూ. 170/-
ప్రతులకు : 2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌ - 500 044.

ఆరు దశాబ్దాలుగా నిత్య సంక్షోభంలో మునిగి ఉన్న కశ్మీర్‌ ప్రజల దుర్భర జీవన గాథ ఇది. జీవన్మరణ పోరాటాల కథ ఇది. దారుణ నిర్బంధ కాండ కథ ఇది. 

ఇటు భారత ప్రభుత్వ సైనిక బలగాల దౌర్జన్యాలకూ, అటు పాకిస్తాన్‌ ప్రేరిత మిలిటెంట్‌ సంస్థల దౌర్జన్యాలకూ మధ్య కశ్మీర్‌ ప్రజల స్వయం నిర్ణయాధికార ఆకాంక్ష ఎట్లా అణగిపోతున్నదో ఎన్నెన్నో జీవితాలతో నిరూపించి చూపిన కథ ఇది. 

అంతర్జాతీయ ప్రాధాన్యత సంతరించుకున్నప్పటికీ, ప్రపంచ స్థాయి, ఇరుదేశాల ద్వైపాక్షిక స్థాయి సమావేశాల్లో ఎంత చర్చ జరిగినా, తమను ఆ చర్చల్లో ఎన్నడూ భాగం చెయ్యని పాలకవర్గ దుర్మార్గం మీద కశ్మీరీ ప్రజల్లో రగులుతున్న నిప్పు నిషిద్ధ రాత్రులను ఎలా వెలిగిస్తున్నదో చూపిన కథనం ఇది. 

సాధారణ జీవితం కోల్పోయిన లక్షలాది మంది ప్రజల ఆవేదనకు అక్షర రూపం ఇది.



Thursday, 6 July 2017

ధ్వంసమైన స్వప్నం అరుంధతీ రాయ్‌ వ్యాసాలు - పునర్ముద్రణ వెలువడింది.

మలుపు ప్రచురణ : 

ధ్వంసమైన స్వప్నం
పునర్ముద్రణ వెలువడింది.

మూలం : బ్రోకెన్‌ రిపబ్లిక్‌
అరుంధతీ రాయ్‌ వ్యాసాలు

అనువాదం : 
చిదంబరం వార్‌ - ప్రభాకర్‌ మందార 
వాకింగ్‌ విత్‌ ద కామ్రేడ్స్‌ - పి. వరలక్ష్మి 
ట్రికిల్‌డౌన్‌ రెవల్యూషన్‌ - కడలి

ఫొటోలు : సంజయ్‌ కాక్‌ అండ్‌ అరుంధతీ రాయ్‌

చిదంబర రహస్యం
భారతదేశం అనే దేశం గానీ, ఒరిస్సా అనే రాష్ట్రం గానీ లేకముందు నుంచీ కూడ దక్షిణ ఒరిస్సాలోని ఈ చదునైన తక్కువ ఎత్తు కొండల వరస డోంగ్రియా కోందుల నివాస స్థలంగా ఉంది.

కారడవిలో కామ్రేడ్స్‌తో
నా తలుపు కింది నుంచి లోపలికి తోసుకొచ్చిన క్లుప్తంగా టైప్‌ చేసిన చీటీ 'భారతదేశపు అతిపెద్ద అంతరంగిక భద్రతా సవాలు'తో నా కలయికను నిర్ధారించింది. వాళ్ల సందేశం కోసం నేను ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్నాను.
మానవజాతి మనుగడ కోసం విప్లవం
2010 జూలై 2 తెల్లవారు జామున ఆదిలాబాద్‌లోని మారుమూల అడవుల్లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పోలీసులు చెరుకూరి రాజకుమార్‌ అనే వ్యక్తి ఛాతీలోకి తూటా దించారు. ఆ వ్యక్తి సహచరులకు ఆజాద్‌గా పరిచితుడు.

యుద్ధం భారతదేశపు సరిహద్దుల నుంచి దేశం గుండెకాయ అయిన అడవులకు తరలి వచ్చింది. అద్భుతమైన సమాచార వివరణనూ విశ్లేషణనూ మిళితం చేసిన భారదేశపు సుప్రసిద్ధ రచయితలలో ఒకరు ఈ పుస్తకంలో ప్రపంచ అగ్రరాజ్యంగా ఎదుగుతున్న చోట ప్రగతి, అభివృద్ధి స్వభావాన్నీ పరీక్షిస్తున్నారు. అసలు ఆధునిక నాగరికత గురించే మౌలిక ప్రశ్నలు అడుగుతున్నారు.



ధ్వంసమైన స్వప్నం
అరుంధతీ రాయ్‌ వ్యాసాలు
వెల : 150/-

ప్రతులకు : 
నెం.  2-1-1/5, నల్లకుంట, హైదరాబాద్‌ - 500 044.

Tuesday, 30 May 2017

త్వరలో మలుపు ప్రచురణగా వెలువడనున్న కెన్యా రచయిత గూగీ వా తియాంగో రచన డ్రీమ్స్‌ ఇన్‌ ఎ టైమ్‌ ఆఫ్‌ వార్‌ - చైల్డ్‌హుడ్‌ మెమరీస్‌, అనువాదం : ప్రొ. జి ఎన్‌. సాయిబాబా


యుద్ధకాలంలో స్వప్నాలు - బాల్య జ్ఞాపకాలు
డ్రీమ్స్‌ ఇన్‌ ఎ టైమ్‌ ఆఫ్‌ వార్‌ - చైల్డ్‌హుడ్‌ మెమరీస్‌
రచన : గూగీ వా తియాంగో
తెలుగు అనువాదం : జి. ఎన్‌. సాయిబాబా

త్వరలో మలుపు ప్రచురణగా వెలువడుతోంది :
తెలుగు ద్వితీయ ముద్రణకు  గూగీ రాసిన ముందుమాట లోంచి కొంత భాగం :

ప్రొఫెసర్‌ సాయిబాబా దీన్ని అనువదించడం నాకు చాల సంతోషం.
1996 ఫిబ్రవరిలో ఢిల్లీలో జాతుల సమస్యపై జరిగిన అంతర్జాతీయ సదస్సు సందర్భంగా కష్టజీవి సాయిబాబాతో నా కలయిక జ్ఞాపకాలను నేనెన్నటికీ మరచిపోలేను. హైదరాబాదులో ఒక పుస్తకాల దుకాణంలో అనుకోకుండా
దొరికిన నా పుస్తకం "డెవిల్‌ ఆన్‌ ది క్రాస్‌" తన జీవితం మీద ఎంత ప్రభావం వేసిందో ఆయన చెప్పడం
నాకింకా గుర్తుంది.

 నేను ఆ నవలను కెన్యాలోని కామిటి మాగ్జిమమ్‌ సెక్యూరిటీ జైలులో 1978లో
టాయిలెట్‌ పేపర్‌ మీద రాశాను.

నా సాంస్కృతిక కార్యాచరణ వల్ల, ముఖ్యంగా కెన్యాలోని కామిరితు గ్రామంలో రైతులు, కార్మికులు తమ భాషలో తమ పోరాటాల గురించి చెప్పే తమ సొంత నాటకరంగాన్ని సృష్టించాలని చేసిన ప్రయత్నానికి సహకరించినందువల్ల నన్ను జైలులో పెట్టారు.

నా పుస్తకాల్లో మరొకదాన్ని అదే సాయిబాబా మహారాష్ట్ర లోని నాగపూర్‌ హైసెక్యూరిటీ జైలులో ఖైదీగా ఉండి అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి?!

దుర్భరమైన జైలు పరిస్థితుల్లో అనువాదం చేయడం! ఆయన తన జీవిత, సాంస్కృతిక కార్యాచరణ కోసం జైలు జీవితం గడుపుతున్నాడంటే నాకు ఆయనతో ఇప్పుడు, మరొకసారి, ఒక ప్రత్యేకమైన బంధం ఉందనిపిస్తున్నది.

- గూగీ వా థియోంగో

మొదటి ప్రచురణ : మే, 2016

యుద్ధకాలంలో స్వప్నాలు - బాల్య జ్ఞాపకాలు
గూగీ వా తియాంగో
మూలం : డ్రీమ్స్‌ ఇన్‌ ఎ టైమ్‌ ఆఫ్‌ వార్‌ - చైల్డ్‌హుడ్‌ మెమరీస్‌
అనువాదం : ప్రొ. జి. ఎన్‌. సాయిబాబా

వెల : రూ. 200/-
ప్రచురణ : మలుపు, హైదరాబాద్‌.


 (ప్రొ. జి. ఎన్‌. సాయిబాబా నాగపూర్‌ హైసెక్యూరిటీ జైలులో అండర్‌ ట్రయల్‌గా ఉన్నప్పుడు ఈ పుస్తకాన్ని తెలుగులోకి అనువదించారు. ఇప్పుడు ఆయన జీవిత ఖైదు శిక్ష ను ఎదుర్కొంటున్నారు.)






Sunday, 21 May 2017

మానవీయతకు కర్ఫ్యూ కాటు

మానవీయతకు కర్ఫ్యూ కాటు
నమస్తే తెలంగాణా "చెలిమె" 22-5-2017